మహిళల రక్షణే మహిళా కమిషన్ అజెండా:Sunita laxma reddy
ABN , First Publish Date - 2022-05-11T23:12:25+05:30 IST
మహిళలు ఎదుర్కొనే న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunita laxma reddy)కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు.
హైదరాబాద్: మహిళలు ఎదుర్కొనే న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunita laxma reddy)కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే కేసులపై బుధవారం కమిషన్ కార్యాలయము నందు సమీక్ష నిర్వహించారు. సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కమిషన్ భావిస్తోందని చైర్ పర్సన్ వెల్లడించారు. హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో జరిగిన కమిషన్ సర్వ సభ్య సమావేశానికి ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు షాహిన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణే మన ప్రధాన ఎజెండగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. జిల్లాల వారిగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులను సమన్వయపరచాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వ సభ్య సమావేశంలో సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్యను కమీషన్ తీవ్రంగా ఖండిస్తు నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళల పట్ల అనుచిత ప్రవర్తనను నిరోధించే సెక్షన్లను కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరినట్టు తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి వైద్య శాఖ చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ఇటీవల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ నంబరుకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదాల, కోర్టు కేసుల పట్ల మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్ పరిధిలోకి రావని చైర్ పర్సన్ సునిత లక్ష్మారెడ్డి వెల్లడించారు.