బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా తెలంగాణ

ABN , First Publish Date - 2022-05-17T10:38:38+05:30 IST

గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు.

బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా తెలంగాణ

ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం: కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పిన శాంతి, సహనం, అహింసా మార్గాలు నేటికీ అనుసరణీయమన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున నాగార్జున సాగర్‌లో ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనాన్ని ప్రభుత్వం ఇటీవల జాతికి అంకితం చేసిందని తెలిపారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లనుందన్నారు. సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుడి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారు.


Updated Date - 2022-05-17T10:38:38+05:30 IST