తయారీ యూనిట్లు పెట్టండి
ABN , First Publish Date - 2020-09-11T06:29:31+05:30 IST
తెలంగాణలో తయారీ యూనిట్లు పెట్టే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది...
- ఈవీ కంపెనీలకు తెలంగాణ ఆహ్వానం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణలో తయారీ యూనిట్లు పెట్టే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ (పీఎంఏ) కల్పిస్తామని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పర్యావరణ అనుకూల రంగమైన ఈవీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ‘ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్’ విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని అన్నారు. ఎనర్జీ స్టోరేజీ, మొబిలిటీపై ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విధానం ద్వారా అనేక ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు జయేశ్ చెప్పారు. దేశంలో సమర్థమంతమైన ఎనర్జీ స్టోరేజీ, మొబిలిటీని ప్రోత్సహించడానికి అనేక అనుకూల విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని నీతిఆయోగ్ మొబిలిటీ మిషన్ డైరెక్టర్ అనిల్ శ్రీవాత్సవ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బ్రహ్మ విద్యేమీ కాదని ఐసీసీ ప్రెసిడెంట్ మయాంక్ జలాన్ అన్నారు. ఎనర్జీ స్టోరేజీ, ఈవీ వాహనాల తయారీలో వినియోగించే వస్తువులు, విడిభాగాలపై ఒక విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఐసీసీ దక్షిణ ప్రాంత చైర్మన్ రాజీవ్ రెడ్డి తెలిపారు.