వాన్పిక్ కేసులో అసైన్డ్ భూముల జప్తుపై లోతైన విచారణ జరగాలి
ABN , First Publish Date - 2022-09-28T08:10:46+05:30 IST
వాన్పిక్ కేసులో అసైన్డ్ భూముల జప్తుపై లోతైన విచారణ జరగాలి
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
11,804 ఎకరాల స్వాధీనంపై విచారణ నవంబరు 14కి వాయిదా
1,400 ఎకరాల పట్టాదుర్మార్గుడి పాలనతోనే రాష్ట్రానికి చేటు
‘అమరావతి’పై అబద్ధాలు చెప్పి నాశనం చేస్తున్నారు
నాడు అమరావతికి జగన్ మద్దతు ఇవ్వలేదా?
వైసీపీ రౌండ్టేబుల్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వెళ్లలేదు
ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు
మూడున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టూ తేలేకపోయారు: అచ్చెన్నాయుడు
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన వాన్పిక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాన్పిక్ పోర్ట్స్, వాన్పిక్ ప్రాజెక్ట్స్ కంపెనీలకు సంబంధించి జప్తు చేసిన 11,804 ఎకరాల భూముల విడుదలపై మరింత లోతుగా విచారణ జరగాలని స్పష్టంచేసింది. అయితే ఏపీలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జప్తుచేసిన 1,416 ఎకరాల పట్టా భూములను మాత్రం విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాన్పిక్ ఒప్పందం అక్రమంగా జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ 2012లో దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ.. 2014లో వాన్పిక్ ప్రాజెక్ట్స్, వాన్పిక్ పోర్ట్స్కు చెందిన 1,416 ఎకరాల పట్టా భూములను అటాచ్ చేసింది. రస్-అల్-ఖైమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరిగిన వాన్పిక్ ఒప్పందంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని.. ఈ ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉన్నదని.. ఒప్పందం రద్దు కాకుండా తమ ఆస్తులను అటాచ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లయిన వాన్పిక్ ప్రాజెక్ట్స్, వాన్పిక్ పోర్ట్స్ ఢిల్లీలోని ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించాయి. అథారిటీ.. జప్తు ఉత్తర్వులను సమర్థించింది. అథారిటీ ఉత్తర్వులపై పిటిషనర్ కంపెనీలు ఈడీ అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లు పెండింగ్లో ఉండగా.. ఈడీ 2017లో ఇవే కంపెనీలకు చెందిన 11,804 ఎకరాల అసైన్మెంట్ భూములను అటాచ్ చేసింది. దీనిపైనా సదరు కంపెనీలు అడ్జుడికేటింగ్ అథారిటీని.. ఆ తర్వాత అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. పీఎంఎల్ఏ నిబంధనలకు విరుద్ధంగా ఈడీ భూములను జప్తు చేసిందని.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ట్రైబ్యునల్ తన తీర్పులో పేర్కొంది.
అయితే జప్తు చేసిన భూములను విడుదల చేయకుండా హైదరాబాద్లోని సీబీఐ-ఈడీ కేసుల ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేక కోర్టుకు వెళ్లాలనడం చట్టవిరుద్ధమంటూ పిటిషనర్ కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. మొత్తం మూడు అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాది అతుల్ నందన్ వాదనలు వినిపించారు. మొదట సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటే చట్టవిరుద్ధమైనదని.. అది న్యాయ విచారణకు నిలబడదని..సీబీఐ కేసు ఆధారంగా ఈడీ చేసిన జప్తు చెల్లదని.. అసలు ఈడీ నమోదు చేసి దర్యాప్తు చేసిన కేసులో ఎటువంటి నేరం జరిగినట్లు నిరూపితం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో భూముల జప్తును కొట్టేయాలని కోరారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు.
అప్పిలేట్ ట్రైబ్యునల్ తన ఆదేశాల్లో వాన్పిక్ ఒప్పందం అమలులో ఉందో లేదో ఏపీ ప్రభుత్వం ధ్రువీకరించాలని పేర్కొందని గుర్తుచేశారు. ఒప్పందం అమలులో ఉందో లేదో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. అయితే ఈ కేసులో సీఎం జగనే నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సదరు నిర్ణయంలో సీఎం భాగస్వామి కాకూడదని అథారిటీ స్పష్టం చేసిందన్నారు. మొత్తం అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని కోరారు. ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ ఏడాది జూలై 7వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం దానిని వెలువరించింది. ఈడీ అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పును తప్పుబట్టింది. ఈడీ చేసిన అటాచ్మెంట్స్ చట్టవిరుద్ధమని నిర్ణయానికి వచ్చిన ట్రైబ్యునల్.. అక్రమంగా జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేయకుండా ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని ఆదేశించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది.
రిజర్వు చేసిన అంశంపై మళ్లీ విచారణ
11,804 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో హైకోర్టు ప్రత్యేక వైఖరి తీసుకోవడం గమనార్హం. ఈ భూముల జప్తుపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందంటూ.. సదరు పిటిషన్పై తీర్పును రిజర్వు చేసినట్లు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తేసింది. తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. రిజర్వుడు కింద కాకుండా తదుపరి విచారణ కింద ఈ కేసును లిస్ట్ చేయాలని రిజిస్ర్టీకి ఆదేశాలు జారీచేసింది. ఒక కేసులో తీర్పు రిజర్వు చేసిన తర్వాత.. మళ్లీ వినాలంటూ సదరు కేసును ధర్మాసనం విడుదల చేయడం అరుదని న్యాయనిపుణులు అంటున్నారు.