అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

ABN , First Publish Date - 2022-03-08T19:09:26+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్‌పై హైకోర్టులో మంగళవారం ఉదయం బీజేపీ పిటిషన్‌ను దాఖలు చేసింది. అలాగే సస్పెషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో భారత రాష్ట్రపతిని కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. హైకోర్టులో పిటిషన్‌పై ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడుతూ.... హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరి ఉందని విమర్శలు గుప్పించారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభలో గవర్నర్‌ను అవమానిస్తూ.. బల్లలు ఎక్కిన హరీష్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదన్నారు. బడ్జెట్ స్పీచ్‌లో రాజకీయ విమర్శలు చేసిన మంత్రిగా హరీష్ రావు చరిత్రలో నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.


కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ స్పీచ్‌ను ఉపయోగించుకోవటం దుర్మార్గమన్నారు. తమ స్థానంలో నిలబడి నిరసన చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇచ్చిన పేపర్‌ను తలసాని సభలో చదివారన్నారు. పాలకపక్షంతో పాటు.‌‌. ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్ గౌరవం పెరుగుతుందని తెలిపారు. ఏ సెక్షన్ కింద సస్పెషన్ చేశారో రాతపూర్వకంగా చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని అడిగితే నాలుగు రోజులు సమయం అడిగారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-08T19:09:26+05:30 IST