హైదరాబాద్: బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియాతో చాలా చురుగ్గా ఉంటారు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలీలో సూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటనలకే తప్పు.. ఆచరణలో చేసిందేమీ లేదని విమర్శించారు. విజయశాంతి తన ఫేస్బుక్ అకౌంట్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘ప్రజలకు ఆసరాగా నిలిచి ఆదుకోవలసిన తెలంగాణ సర్కారు ఆ కర్తవ్యాన్ని మరిచిపోయి అధికార ఆసరా కోసం నానా పాట్లు పడుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని... 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టింది. తీరా చూస్తే ఏప్రిల్ 1వతేదీ అనేది కొన్ని గంటల్లోకి వచ్చేసినా పరిశీలన ప్రక్రియ మొదలుకాలేదు. సర్కారు ప్రకటనను నమ్మి పాపం దాదాపు 11 లక్షల మంది ఆసరా పింఛన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, కొత్త అప్లికేషన్లను పరిశీలనకు మార్గదర్శకాలు జారీ కాలేదు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇస్తారా? లేదా... వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారా? వంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు సరికదా... మృతుల స్థానంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించలేదు’’ అని విజయశాంతి మండిపడ్డారు.
‘‘ఈ మూడేళ్లలో ఆసరా లబ్ధిదారులలో 2,21,000 మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తుండగా... మరో 28 వేల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి పింఛను నిలిపివేశారు. వీరి స్థానంలో అర్హులైనవారెవరికీ పింఛన్ ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదు. ఇక మరోవైపు 57 ఏళ్ళు దాటినవారికి కూడా పింఛన్ మంజూరు చేస్తామన్న సర్కారు... బడ్జెట్ కేటాయింపులు మాత్రం అదనంగా పైసా కూడా పెంచలేదు. పైగా గతేడాది కేటాయించిన రూ.11,728 కోట్ల బడ్జెట్లో 9 వేల కోట్లు మాత్రమే ఖర్చయినందున ఈ సారి బడ్జెట్ కేటాయింపులు పెంచలేదని ప్రభుత్వ వర్గాలు విచిత్ర వాదన వినిపిస్తున్నాయి. 65 ఏళ్ళు దాటిన దరఖాస్తు దారులు సుమారు 2 లక్షల 86 వేలమంది కాగా... 57-65 ఏళ్ల మధ్య దరఖాస్తుదారులు 7,98,000 మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మరి ఏడున్నర లక్షలకు పైగా ఆదనంగా దరఖాస్తులు వచ్చినప్పుడు బడ్జెట్ పెంచకుండా ఆసరా ఎలా సాధ్యమన్న ప్రశ్నకు జవాబు లేదు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఈ సర్కారుకు ప్రజల ఆసరా ఉండదని స్పష్టమవుతోంది’’ అని హెచ్చరించారు.