అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్
ABN , First Publish Date - 2022-06-02T15:10:18+05:30 IST
పబ్లిక్ గార్డెన్లో ఎనిమిదవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న సీఎం
హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్లో ఎనిమిదవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation day) వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్(KCR) ముందుగా తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఆపై పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని, 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే స్థితికి చేరుకున్నామన్నారు. పెరిగిన ఆదాయంతో ప్రతి పైసాను అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ శిఖరాగ్రాన నిలిచిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరుకుందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం ముందుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని, అతి తక్కువ కాలంలో మిషన్ తెలంగాణ సక్సెస్ సాధించామన్నారు. మంచినీరు దొరకని ప్రాంతం తెలంగాణలో లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.