ICUలోకి నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన తెలంగాణ BJP నాయకుడు..

ABN , First Publish Date - 2022-01-11T14:26:18+05:30 IST

ICUలోకి నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన తెలంగాణ BJP నాయకుడు..

ICUలోకి నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన తెలంగాణ BJP నాయకుడు..

హైదరాబాద్ సిటీ/మన్సూరాబాద్‌ : ఆస్పత్రి ఐసీయూలోకి నడుచుకుంటూ వెళ్లిన బీజేపీ నాయకుడు ఆస్పత్రిలోనే మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. చైతన్యపురిలో ఉంటున్న మోర్‌ యాదగిరి (38) బీజేపీ ఆర్‌టీఐ సెల్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుండటంతో.. ఒక్కరే నాగోలు చౌరస్తాలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. రిసెప్షన్‌ వద్దకు వెళ్లి ఛాతీనొప్పి అని చెప్పాడు. ఆ వెంటనే ఆస్పత్రి ఐసీయూలోకి సిబ్బంది తీసుకెళ్తున్నారు. ఐసీయూలోకి నాలుగైదు అడుగులు వేస్తూనే.. యాదగిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కిందపడే క్రమంలో ఆస్పత్రిలోని స్ట్రెచర్‌ కూడా బలంగా తగిలింది. ఐసీయూలో ఉన్న కాంపౌండర్‌ కూడా సపర్యాలు చేశాడు.


కొంత సేపటికే యాదగిరి కన్నుమూశాడు. అతను లోపలికి ప్రవేశించింది, ఐసీయూలోకి నడుచుకుంటూ వెళ్లి కిందపడిన తీరు అంతా సీసీ కెమెరాలలో రికార్డు అయింది. అయితే యాదగిరి మరణవార్త తెలుసుకున్న బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రంగా నర్సింహగుప్తా, బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్రకోశాధికారి చింతల సురేందర్‌యాదవ్‌ వచ్చి.. యాదగిరి మరణంపై ఆరా తీశారు. సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే యాదగిరి చనిపోయాడని ఆరోపించారు. యాదగిరి కింద పడిపోయిన రెండు నిమిషాలకు వైద్యుడు వచ్చినా.. చూస్తూ నిలబడ్డాడే తప్పా, కనీసం యాదగిరిని పట్టించుకోలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. వైద్యం అందించకపోటం వల్లే అతను మృతి చెందాడని విమర్శించారు. ఎల్‌బీనగర్‌ పోలీసులు కల్పించుకొని.. నాయకులను సముదాయించారు.


సోదరుడి ఆరోపణ..

మృతుడి సోదరుడు దాసర్ల విష్ణు బంధువులతో పాటు ఆస్పత్రి వద్దకు చేరుకుని యాదగిరి మృతికి వైద్యుడు, యాజమాన్యం కారణమంటూ ధర్నా చేశారు. ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి అధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-01-11T14:26:18+05:30 IST