నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2022-08-20T12:39:39+05:30 IST
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఇద్దరి అరెస్ట్
గోషామహల్, (ఆంధ్రజ్యోతి): బేగంబజార్ మార్కెట్లో నకిలీ అల్లం వెల్లులిని వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.5 లక్షల విలువైన 650 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆసి్ఫనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాఫర్ ఆలం (38) ఓ గదిని అద్దెకు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే చిన్నపాటి ఫ్యాక్టరీని ప్రారంభించాడు. పేస్ట్ నిల్వ ఉండేందుకు కొంతకాలంగా సిట్రిక్ యాసిడ్ను కలుపుతున్నాడు. మాలకుంట ప్రాంతానికి చెందిన సోమనాథ్ శెట్టి (50) జాఫర్ నుంచి ఈ పేస్ట్ను కొనుగోలు చేసి, ప్రజలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, బేగంబజార్ పోలీసులు ఆలం ఇంటిపై దాడి చేసి 650 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ను, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.