బీహార్‌లో అరాచకానికి కేంద్ర మంత్రి మాటలే నిదర్శనం: తేజస్వి

ABN , First Publish Date - 2021-03-08T00:18:20+05:30 IST

ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులను కర్రలతో బాదండంటూ కేంద్ర మంత్రి ..

బీహార్‌లో అరాచకానికి కేంద్ర మంత్రి మాటలే నిదర్శనం: తేజస్వి

న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులను కర్రలతో బాదండంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. బీహార్‌లో అరాచకానికి మంత్రి వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. హింసను రెచ్చగొట్టే మంత్రులకు నితీష్ ప్రభుత్వం రివార్డులిస్తుందని, నిజం చెప్పే జర్నలిస్టులపై మాత్రం ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


గిరిరాజ్ సింగ్ తన సొంత నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి చిన్న సమస్యకు తన వద్దకు రానక్కరలేదని, ఎంపీలు ఎమ్మెల్యేలు, గ్రామాధికారులు ఉన్నారని, సమాజానికి సేవ చేయడమే వారి బాధ్యతని చెప్పారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ స్పందించకపోతే రెండు చేతులతో వెదురు కర్రలు తీసుకుని వాళ్ల తలలపై మోదండని సూచించారు. అప్పటికీ వినని పక్షంలో తాను స్వయంగా ప్రజలకు అండగా నిలబడతానని అన్నారు. కాగా, అధికారులపై దాడి చేయండంటూ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి, బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సైతం ఖండించారు. అధికారులపై దాడి చేయమనడం సరికాదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-03-08T00:18:20+05:30 IST