కరోనాతో మృతి చెందిన మహిళకు తహశీల్దార్ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-11T22:46:08+05:30 IST

కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవ సంబంధాలను సైతం ఎలా చంపేస్తోందో చెప్పేందుకు సజీవ సాక్ష్యమిది..

కరోనాతో మృతి చెందిన మహిళకు తహశీల్దార్ అంత్యక్రియలు

జైపూర్: కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవ సంబంధాలను కూడా ఎలా చంపేస్తోందో చెప్పేందుకు సజీవ సాక్ష్యమిది.. కొవిడ్-19 కారణంగా చనిపోయిన ఓ మహిళ మృతదేహం ఐదు గంటల పాటు ఇంటి ముందు ఉన్నా.. కనీసం ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులుగానీ, బంధువులు గానీ ముందుకు రాలేదు. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలు కోసం సహకరించాలంటూ ఆమె భర్త నిస్సహాయుడిగా నిలబడి దీనంగా వేడుకున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. చివరికి గ్రామ సర్పంచి ద్వారా ఈ వార్త తెలుసుకున్న ధోడ్ నగర తహశీల్దార్ రజినీ యాదవ్‌ ఆమె హుటాహుటిన అక్కడికి తరలి వెళ్లారు. తన బృందంతో కలిసి పీపీఈ కిట్లు ధరించి స్వయంగా మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


ఈ సందర్భంగా రజినీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓ కొవిడ్ పేషెంట్‌కు అంత్యక్రియలు నిర్వహించేందుకు అవరోధాలు ఎదురవుతున్నాయంటూ సర్పంచ్ నాకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహాన్ని తొలుత ఆమె గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్క అంబులెన్స్ కూడా వారికి దొరకలేదని కూడా తెలిసింది. అంబులెన్స్ కోసం మేము కూడా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి ఓ వాహనాన్ని మాట్లాకుని మృతదేహాన్ని తరలించాం...’’ అని పేర్కొన్నారు. మృతురాలి ఇంటి దగ్గర 12, 13 ఏళ్ల ఆమె పిల్లలు, భర్త ఎదురుచూస్తున్నారనీ... మిగతా బంధువులు, కుటుంబ సభ్యులను సంప్రదించినా ఒక్కరు కూడా అక్కడికి రాలేదని తహశీల్దార్ అన్నారు. ‘‘వాళ్లు తమ ఇళ్లలో నుంచి బయటికి రాలేమంటూ తెగేసి చెప్పారు. దీంతో నేను పీపీఈ కిట్ ధరించి మృతురాలి పిల్లలతో కలిసి అంత్యక్రియలు నిర్వహించాను..’’ అని ఆమె వివరించారు. 

Updated Date - 2021-05-11T22:46:08+05:30 IST