హైదరాబాద్లో ప్రాణాలు తీస్తున్న టీనేజర్ల కార్ల క్రేజ్
ABN , First Publish Date - 2021-04-12T17:20:40+05:30 IST
ఈ నెల 8న రాత్రి మలక్పేట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ఖాన్ కుమారుడు...
- ట్రయల్కు వెళ్లి ప్రమాదాలు
- ఇప్పటికే రెండు ఘటనలు
- తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిందే..
హైదరాబాద్ : ఈ నెల 8న రాత్రి మలక్పేట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ఖాన్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్ రషీద్ఖాన్ (19) కారు కొనుగోలు నిమిత్తం స్నేహితులతో కలిసి అత్తాపూర్లోని మొగల్ కానాలాకు వెళ్లాడు. అక్కడ ఓ కారును చూసి ట్రయల్ వేశారు. కానీ, కారు నచ్చలేదు. ఇదే విషయాన్ని కారు విక్రయించే వారికి చెప్పగా, వారు కారులో సమస్య ఏముందని ఎదురు ప్రశ్నించారు.
‘మీకు సరిగ్గా డ్రైవ్ చేయడం రాలేదు. నేను నడిపి చూపిస్తా’నంటూ ఓనరు రషీద్ఖాన్ను కూర్చొబెట్టుకుని స్టార్ట్ చేశాడు. రషీద్ఖాన్ను ఆకట్టుకునేందుకు అతి వేగంగా కారును నడిపించాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపులోకి రాకపోవడంతో ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ లాగాడు. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రషీద్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న కొడుకు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు.
కార్ల క్రేజ్ యువత ప్రాణాలు బలిగొంటోంది. టీనేజ్ సరిగ్గా దాటని వారు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ట్రయల్ వేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఔటర్ రింగ్ రోడ్డుపై సరిగ్గా కారు ట్రయల్ కోసం వెళ్లే సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. నెల రోజులు గడవక ముందే లంగర్హౌజ్ పీఎస్ పరిధిలతో మరో యువకుడు చనిపోయాడు. ఈ ప్రమాదాలు సాధారణంగానే కనిపించినప్పటికీ వీటి వెనుక కారణాలు ఆరా తీస్తే తెలుసకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. కార్ల కోసం ఉత్సాహం చూపే ముందు డ్రైవింగ్ తెలిసి ఉండటమే కాకుండా, పెద్దలతో కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ నెల 8న రాత్రి జరిగిన ప్రమాదంలో కారు నడిపిందెవరు అన్న విషయాన్ని లంగర్హౌజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
అప్రమత్తత అవసరం
టీనేజీ కుర్రాళ్లు బైక్లు నడపడమే ప్రమాదకరమని, 18 ఏళ్లు నిండిన తర్వాతనే వాహనాలను డ్రైవ్ చేయాలని పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ ఇంజనీరింగ్, నిబంధనలపై అవగాహన లేకుండా వాహనాలు డ్రైవ్ చేస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.