‘జేఈఈ మెయిన్స్’లో సాంకేతిక సమస్య
ABN , First Publish Date - 2022-06-25T09:26:09+05:30 IST
సర్వర్లో సాంకేతిక సమస్యల వల్ల శుక్రవారం రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష గంటల తరబడి ఆలస్యంగా మొదలైంది. అబిడ్స్లోని ఓ కేంద్రంలో రెండో సెషన్
పలు చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష
చాదర్ఘాట్/మంగళ్హాట్/తిమ్మాపూర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సర్వర్లో సాంకేతిక సమస్యల వల్ల శుక్రవారం రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష గంటల తరబడి ఆలస్యంగా మొదలైంది. అబిడ్స్లోని ఓ కేంద్రంలో రెండో సెషన్ వాయిదా పడింది. అబిడ్స్లోని అరోరా కళాశాలలో దాదాపు 400 మందికి సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరగాల్సి ఉంది. ఉదయం 7 నుంచే అభ్యర్థులు సెంటర్కు చేరుకోగా అధికారులు పలు కారణాలతో వారిని కొంత సేపు అడ్డుకున్నారు. అనంతరం సర్వర్ డౌన్ ఉందని, 10.30కి పరీక్షను ప్రారంభిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా మొదలైన మొదటి సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అభ్యర్థులు రెండో సెషన్ కోసం లోపలికి వెళ్లగా, ఎంతకూ పరీక్ష ప్రారంభం కాలేదు. సర్వర్ డౌన్ వల్ల సాయంత్రం 6 గంటలకు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
దీంతో అభ్యర్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముసారాంబాగ్లోని అరోరా పీజీ కళాశాలలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. ఇక్కడ విద్యార్థుల హాల్ టికెట్ల స్కానింగ్ కోసం ఆరు కంప్యూటర్లను ఏర్పాటు చేయగా, అందులో ఒకటి మాత్రమే పనిచేసింది. దీంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 100 మందిని మాత్రమే అనుమతించి, వారికి పరీక్ష ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మిగతా విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అయితే, రాష్ట్రంలోని ఇతర కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్ పూర్తికాగానే.. ప్రైవేటు ఇన్స్టిట్యూట్ల నిర్వాహకులు 12.15 గంటల ప్రాంతంలో యూట్యూబ్లో కీ పెట్టారని.. కీ విడుదలైన తర్వాత మూసారాంబాగ్ కేంద్రంలో మొదటి సెషన్ పరీక్ష ఎలా పెడతారని నిర్వాహకులను తల్లిదండ్రులు నిలదీశారు. శుక్రవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని వాగీశ్వరి, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన మొదటి సెషన్ పరీక్ష సాంకేతిక సమస్యల వల్ల దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది.