రెవెన్యూలో సాంకేతిక లోపాలు తొలగాలి
ABN , First Publish Date - 2020-06-04T08:38:48+05:30 IST
రెవెన్యూ శాఖలోని సాంకేతిక లోపాలను అధికమించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం, రెవె న్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
కంకిపాడు, జూన్ 3 : రెవెన్యూ శాఖలోని సాంకేతిక లోపాలను అధికమించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం, రెవె న్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. జిల్లాలో ఆటోమ్యుటేషన్పై ఏర్పాటు చేసిన ప్రజంటేషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రిజిస్ర్టేషన్లు, రెవెన్యూ శాఖల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గంటలోపే డాక్యుమెంట్లను సంబంధిత వ్యక్తులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 12 వేల రిజిస్ర్టేషన్లకు మ్యుటేషన్ కూడా పూర్తి అయ్యిందన్నారు. రెవెన్యూ శాఖ ఇతర శాఖలకు తల్లివంటిదన్నారు.
ఈ విభాగం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఇతర శాఖలు అధారపడి ఉంటాయన్నారు. ఆటోమ్యుటేషన్పై స్థానిక తహసీల్దార్ టి.వి. సతీష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే కొలుసు పార్ధ సారఽథి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, సీసీఎల్ఎ జాయింట్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఎ పీడీ సీఎంఆర్వో సునీత, జేసీ మాధవీలత, సబ్ కలెక్టరు ధ్యానచంద్ర, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎస్. శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అగమ్యగోచరంలో దస్తావేజులేఖర్లు
దస్తావేజులేఖర్లకు లైసెన్స్ ఇస్తారా అన్న ప్రశ్నకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తిత్వాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకున్న గంటలోనే దస్తావేజులు అందజేయడం జరుగుతుందన్నారు.