కనపడలేదా కష్టజీవుల కన్నీటి ఘోష!

ABN , First Publish Date - 2021-11-30T07:56:52+05:30 IST

‘‘కాలం గడుస్తూనే ఉంది. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీదే మా బతుకులు గడిచిపోతున్నాయి’’ అంటూ టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కనపడలేదా కష్టజీవుల కన్నీటి ఘోష!

తిరుపతి(కల్చరల్‌), నవంబరు 29: ‘‘కాలం గడుస్తూనే ఉంది. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీదే మా బతుకులు గడిచిపోతున్నాయి. మా బిడ్డల భవిష్యత్తు చీకటిమయంగానే కొనసాగుతోంది.’’ అంటూ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్న  కాంట్రాక్టు కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు రోజులుగా జడివానలోనూ, వణికించే చలిలోనూ  పగలూ రాత్రీ టీటీడీ పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.  కాంట్రాక్టు వ్యవస్తే రద్దు చేస్తానని ఎన్నికల ముందు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ మాట మరచిపోయారెందుకని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 7000 మంది  అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతుండగా, కనీసం టీటీడీలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో అయినా కలపండి స్వాములారా అని మరో 7000 మంది వేడుకుంటున్నారు. వానకు తడుస్తూనే పిల్లా పాపలతో నిరసన శిబిరాల్లో ఉంటున్నారు. మంగళవారం మహాధర్నాకు సిద్ధమైన ఈ శ్రమజీవుల గోడును స్థానిక ప్రజానేతలైనా విని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు. 

Updated Date - 2021-11-30T07:56:52+05:30 IST