India vs England: కోహ్లీ సేనకు శుభవార్త
ABN , First Publish Date - 2021-07-17T00:49:26+05:30 IST
కొవిడ్ కల్లోలం రేగిన భారత జట్టుకు ఇది నిజంగా శుభవార్తే. ఆటగాళ్లకు తాగా నిన్న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో
లండన్: కొవిడ్ కల్లోలం రేగిన భారత జట్టుకు ఇది నిజంగా శుభవార్తే. ఆటగాళ్లకు తాగా నిన్న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో జట్టు మొత్తానికి నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు తెలుస్తోంది. రిషభ్ పంత్తోపాటు అతడితో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా వైరస్ లేదని నిర్ధారణ అయినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్పంత్, మరో ఆటగాడు దయానంద్లు గురువారం కరోనా బారినపడ్డారు. వీరితో సన్నిహితంగా ఉండడంతో వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్లను ఐసోలేషన్ చేశారు. అనంతరం మిగతా జట్టు డుర్హమ్లోని శిబిరానికి చేరుకుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు కౌంటీ ఎలెవన్తో మూడు రోజుల మ్యాచ్తోపాటు అంతర్గత మ్యాచ్లు ఆడనుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టుకు నిన్న మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో పంత్ సహా అందరికీ నెగటివ్ అని వచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ కరోనా బారినపడిన ఆటగాళ్లు స్థానిక నిబంధనల ప్రకారం మరో వారం రోజులు ఐసోలేషన్లోనే ఉండనున్నారు. ఇకపై ముందుజాగ్రత్త చర్యగా ఆటగాళ్లందరికీ వారం రోజులపాటు ప్రతి రోజూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.