జయహో జులన్‌

ABN , First Publish Date - 2022-09-25T09:13:39+05:30 IST

తమ దిగ్గజ క్రీడాకారిణి జులన్‌ గోస్వామికి టీమిండియా అత్యుద్భుత వీడ్కోలు పలికింది.

జయహో జులన్‌

‘చివరి’ వన్డేలో భారత్‌ విజయం

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. 

దిగ్గజ పేసర్‌కు ఘనమైన వీడ్కోలు

12 టెస్ట్‌లు-44 వికెట్లు

204 వన్డేలు-255 వికెట్లు

68 టీ20లు-56 వికెట్లు


లార్డ్స్‌ : తమ దిగ్గజ క్రీడాకారిణి జులన్‌ గోస్వామికి టీమిండియా అత్యుద్భుత వీడ్కోలు పలికింది. ఇంగ్లండ్‌తో శనివారం లార్డ్స్‌ జరిగిన మూడో వన్డేలో 16 పరుగులతో విజయం సాధించిన భారత్‌..జులన్‌కు ఆఖరి మ్యాచ్‌ను చిరస్మ రణీయం చేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హర్మన్‌సేన క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం. మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.


దీప్తిశర్మ (68 నాటౌట్‌), మంధాన (50), పూజా వస్త్రాకర్‌ (22) తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. క్రాస్‌ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం పేసర్‌ రేణుకా సింగ్‌ (4/29) చెలరేగడంతో ఇంగ్లండ్‌ ఓవర్లలో 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. డీన్‌ (47) టాప్‌స్కోరర్‌. కెరీర్‌ చివరి వన్డేలో జులన్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌ జట్టు విజయానికి  17 పరుగులు చేయాల్సిన తరుణంలో దీప్తిశర్మ మన్కడింగ్‌ ద్వారా డీన్‌ను అవుట్‌చేసి భారత్‌ను గెలిపించింది. అంతకు ముందు టాస్‌ కోల్పోయి భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. వైస్‌కెప్టెన్‌ మంధాన, దీప్తిశర్మ  మాత్రమే రాణించారు.


సంక్షిప్తస్కోర్లు 

భారత్‌ 45.4 ఓవర్లలో 169 ఆలౌట్‌ (దీప్తిశర్మ 68, మంధాన 50, పూజ 22, కేట్‌ క్రాస్‌ 4/26, కెంప్‌ 2/24, ఎకిల్‌స్టోన్‌ 2/27); ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 153 ఆలౌట్‌ (చార్లీ డీన్‌ 47, రేణుకా సింగ్‌ 4/29, జులన్‌ 2/30 రాజేశ్వరీ గైౖక్వాడ్‌ 2/38).

Updated Date - 2022-09-25T09:13:39+05:30 IST