Bihar: వరదల మధ్య పడవలోనే తరగతులు
ABN , First Publish Date - 2021-09-06T16:40:14+05:30 IST
వరదల్లోనూ పడవలపైనే విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల ఉదంతం బీహార్ రాష్ట్రంలోని కతిమార్ జిల్లా మహనీహరి ప్రాంతంలో తాజాగా వెలుగుచూసింది....
విద్యార్థులకు పాఠాల బోధన
కతిహార్ (బీహార్): వరదల్లోనూ పడవలపైనే విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల ఉదంతం బీహార్ రాష్ట్రంలోని కతిమార్ జిల్లా మహనీహరి ప్రాంతంలో తాజాగా వెలుగుచూసింది. భారీవర్షాల వల్ల కతిహార్ జిల్లా మహనీహరి ప్రాంతంలో వరదలు వెల్లువెత్తడంతో పాఠశాలలు నీట మునిగాయి.దీంతో పాఠశాల ఉపాధ్యాయులు పడవలపై వెళ్లి విద్యార్థులను ఎక్కించుకొని తరగతులు నిర్వహించి అందరి ప్రశంసలందుకున్నారు. ‘‘వరదనీరు తమ ప్రాంతంలో ఆరు నెలల పాటు ఉంటోంది. అసలే కరోనా వైరస్ మహమ్మారి వల్ల పిల్లల విద్యకు తీవ్ర విఘాతం కలిగింది.
దీనికితోడు వరదల వల్ల విద్యార్థులు నష్టపోకూడదని వారిని పడవల్లో ఎక్కించుకొని దానిలోనే పాఠాలు చెబుతున్నామని ఉపాధ్యాయుడు పంకజ్ కుమార్ చెప్పారు.‘‘నేను పదవ తరగతి చదువుతున్నాను, లాక్ డౌన్ వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో ఉపాధ్యాయులు పడవలపై వచ్చి అందులోనే తరగతులు నిర్వహిస్తుండటంతో మేం చదువుకుంటున్నాం’’ అని విద్యార్థి అమీర్ లాల్ కుమార్ చెప్పారు. గంగానదితోపాటు దీని ఉపనదులు వరదలతో ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.వరదల వల్ల విద్యార్థులు నష్టపోకుండా వారికి పడవల్లోనే పాఠాలు చెబుతున్నామని ఉపాధ్యాయులు చెప్పారు.