విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2021-02-27T05:32:44+05:30 IST

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా అడ్డుకున్నారు.

విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
ఉపాధ్యాయుడితో మాట్లాడుతున్న ఎంఈవో శంకరయ్య

ఎంఈవోకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు


ఐరాల, ఫిబ్రవరి 26: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా అడ్డుకున్నారు. గ్రామస్తుల  కథనం మేరకు... బొమ్మసముద్రం ప్రాథమిక పాఠశాలలో బాలకృష్ణ సింగిల్‌ టీచర్‌ పనిచేస్తున్నాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసివేసిన పాఠశాలను ఇటీవల పునఃప్రారంభించారు. అప్పటినుంచి ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మూడు రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడు బాలకృష్ణను నిలదీశారు. ఆయన తన తప్పును అంగీకరించడంతో గ్రామస్తులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. జేసీతో సమావేశంలో ఉన్న ఎంఈవో శంకరయ్య సూచన మేరకు కాణిపాకం జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం చంద్రశేఖర నాయుడు, ఇతర ఉపాధ్యాయులు బొమ్మసముద్రం పాఠశాలకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలో కూడా బాలకృష్ణ రెండుసార్లు సస్పెండ్‌ అయ్యారని, అలాంటి ఉపాధ్యాయుడు తమ పాఠశాలకు అవసరం లేదని తేల్చి చెప్పారు. అతన్ని బదిలీ చేయకపోతే తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఎంఈవో శంకరయ్య పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన ఘటనపై విచారించారు. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

Updated Date - 2021-02-27T05:32:44+05:30 IST