టీచర్ల బదిలీలపై దోబూచులాట

ABN , First Publish Date - 2020-06-01T08:58:58+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. 2017వ సంవత్సరం తర్వాత మళ్లీ బదిలీలు చేపట్టలేదు.

టీచర్ల బదిలీలపై దోబూచులాట

సంఘాల వినతులపై స్పష్టత కరువు

ఆందోళనలో ఉపాధ్యాయలోకం 15 నుంచి నిరసనలకు సిద్ధం


అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. 2017వ సంవత్సరం తర్వాత మళ్లీ బదిలీలు చేపట్టలేదు. ఫలితంగా వేలాది మంది టీచర్లు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఒకే ప్రదేశంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయినా బదిలీ చేయకపోవడంతో ముఖ్యంగా భార్యాభర్తలైన టీచర్లు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏటా ఉద్యోగుల సాధా రణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నా... టీచర్లను మాత్రం పక్కన పెడుతోంది. రాష్ట్రంలో 1.80 లక్షల మంది టీచర్లు ఉండగా, ఇప్పుడు బదిలీలు చేపడితే దాదాపు 50 వేల మందికి న్యాయం జరుగుతుంది.


బదిలీలు చేపట్టాలని టీచర్లు గత ఏడాది కోరగా... ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ సారి సెలవుల్లో చేపట్టాలని కోరినా స్పష్టత ఇవ్వడం లేదని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ ఏడాది సంక్రాంతి సెలవుల్లో చేపడతామని గతంలో మంత్రి సురేశ్‌ హామీ ఇచ్చి... అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో జూన్‌ 10లోపు బదిలీల షెడ్యూల్‌ ప్రకటించాలని ఫ్యాప్టో కోరుతోంది. లేదంటే జూన్‌ 15 నుంచి ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 

Updated Date - 2020-06-01T08:58:58+05:30 IST