ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి
ABN , First Publish Date - 2022-01-21T05:12:08+05:30 IST
ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలతోపాటు వారి డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు.
సీపీఎస్ను వదిలేసి ‘చింతామణి’ రద్దు హాస్యాస్పదం
టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి
ఉపాధ్యాయ సంఘాల నిరసనకు మద్దుతు
నెల్లూరు, (వ్యవసాయం), జనవరి 20 : ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలతోపాటు వారి డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు కోసం ఉపాఽధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాక్టో) గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ అందులో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్రెడ్డి.. దాన్ని పట్టించుకోకుండా చింతామణి నాటకాన్ని రద్దు చేయడం హాస్యాస్పదంగా ఉందని హేళన చేశారు. స్వచ్ఛందంగా నిరసన తెలిపేందుకు వస్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని నిర్బంఽధించడం బాధాకరమన్నారు. మధ్య తరగతి ప్రజలు కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టూ ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉంటే అద్దెలను 4 నుంచి 14శాతం పెంచుతూ వైసీపీ ప్రభుత్వం వారిపై భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో పెట్టుకు న్న ఏ ప్రభుత్వం బాగుపడలేదని, సర్వనాశనం అయిందన్నారు. దమ్ముంటే అశోక్మిత్ర రిపోర్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును వారికి ఇవ్వడం కూడా కష్టంగా ఉందని, ప్రభుత్వం వద్ద డబ్బుల్లేక దివాలా తీసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహిద్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు కపిర శ్రీనివాసులు, బాలాజీ, సత్యనాగేశ్వరరావు, నన్నేసాహెబ్, వెంకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.