వైసీపీ దాడులకు భయపడొద్దు
ABN , First Publish Date - 2020-08-02T17:56:38+05:30 IST
వైసీపీ దాడులకు భయపడాల్సిన పని లేదని, పార్టీ అండగా ఉంటుందని..
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
కర్నూలు(ఆంధ్రజ్యోతి): వైసీపీ దాడులకు భయపడాల్సిన పని లేదని, పార్టీ అండగా ఉంటుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అభయమిచ్చారు. వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన పెద్దకడబూరు మండలం హనుమాపురం తెలుగుదేశం నాయకులు పెద్ద రంగయ్య, పెద్దయ్య తదితరులు ఆయనను పరామర్శించారు. పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి తిక్కారెడ్డితో కలిసి కర్నూలు వనమాలి ఆసుపత్రికి శనివారం వెళ్లారు. పార్టీ జిల్లా సెక్రటరీ రమాకాంత్ రెడ్డి, పెద్దకడబూరు మండలం పార్టీ ప్రెసిడెంట్ ఈరన్న, హనుమాపురం నాయకులు రంగన్న తదితరులను దాడి ఘటన గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కనుసన్నుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు రాష్ట్రంలో రావణ కాష్టాన్ని రగిలిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వారిపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేయడం దారుణమని అన్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం నిలవదని, ప్రజలు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు.