బంద్‌ను సక్సెస్‌ చేయాలంటూ టీడీపీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-03-05T06:11:31+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

బంద్‌ను సక్సెస్‌ చేయాలంటూ టీడీపీ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ దారుణం: ఎమ్మెల్యే వెలగపూడి

ఎంవీపీ కాలనీ, మార్చి 4: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అప్పుఘర్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎంవీపీ సర్కిల్‌, కేనర్‌ ఆస్పత్రి, తేజా అపార్టుమెంట్స్‌, గిరిజన భవన్‌, టీటీడీ  సర్కిల్‌, ఉషోదయ జంక్షన్‌, రామలక్ష్మి అపార్డుమెంట్స్‌ మీదుగా పెదవాల్తేరు  గాంధీసెంటర్‌ వరకు సాగింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఖండించి, ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T06:11:31+05:30 IST