ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన కార్యక్రమాలు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-04-05T02:58:09+05:30 IST
రాష్ట్రంలో కరెంట్ చార్జీల పెంపు, ప్రజలపై పన్నుల భారంపై "బాదుడే బాదుడు" పేరుతో
అమరావతి: రాష్ట్రంలో కరెంట్ చార్జీల పెంపు, ప్రజలపై పన్నుల భారంపై "బాదుడే బాదుడు" పేరుతో టీడీపీ ఆధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త టీడీపీ నిరసన కార్యక్రమాలపై పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఈ రోజు నుంచి మొదలైన ప్రోగ్రాంపై ఆయన రివ్యూ చేశారు. జగన్ ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 16 వేలకోట్ల భారం వేసిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు, పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు.
జగన్ పెంచిన టాక్స్ల కారణంగా ఒక్కో ఇంటిపై 1.10 లక్షల భారం పడుతుందన్నారు. జగన్ విధానాల వల్లనే ఇప్పుడు కరెంట్ కొరత, కోతలు ఏర్పడ్డాయన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తీవ్ర భారం కానున్నాయన్నారు. గ్రామ, మండల స్థాయిలో నెలాఖరు వరకు కార్యక్రమం జరపాలని ఆయన ఆదేశించారు. రాజకీయ కోణంలోనే జిల్లాల విభజన చేశారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదన్నారు. కొత్త జిల్లాలు అన్నాడు....వెంటనే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో బాదుడుకు తెర తీశాడని ఆయన ఆరోపించారు. జగన్ విధానాలను గ్రామ స్థాయిలో ఎండగట్టాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.