గుంతల రోడ్లపై ప్రయాణమెలా..?
ABN , First Publish Date - 2021-07-25T05:32:02+05:30 IST
రహదారులు గుంతలమయమై ప్రజలు ప్రయాణించలేని దుస్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల కష్టలు వైసీపీ సర్కారుకు పట్టవా...? అంటూ టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రజల కష్టాలు పట్టవా?
సజ్జాపురం వద్ద టీడీపీ ఆందోళన
నెల్లూరు రూరల్, జూలై 24 : రహదారులు గుంతలమయమై ప్రజలు ప్రయాణించలేని దుస్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల కష్టలు వైసీపీ సర్కారుకు పట్టవా...? అంటూ టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రోడ్ల దుస్థితిపై ఆ పార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శనివారం రూరల్ మండలంలోని సజ్జాపురం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజా సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సుఖ ప్రయాణం కోసం రోడ్లు కూడా వేయలేకపోతోందని విమర్శించారు. ఎక్కడ చూసినా గతుకులు, అతుకులు, గుంతలు, బావులే దర్శనమిస్తున్నాయని ధ్వజమెత్తారు. సజ్జాపురం ప్రాంతంలో ఇసుక, గ్రావెల్ మాఫియాకు చెందిన భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల రోడ్లు ఛిద్రమయ్యాయని ఆరోపించారు. ఆ రహదారులను బాగు చేయించలేని దయనీయ స్థితిలో అధికార పక్షం ఉందని విమర్శించారు. వర్షాకాలం మొదలైన నేపఽథ్యంలో రోడ్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగారావు, సంపత్యాదవ్, భూలక్ష్మి, చెన్నారెడ్డి శ్రీకాంత్రెడ్డి, మల్లి నిర్మల, రేవతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.