48 గంటల్లోగా ధాన్యం బకాయిలు చెల్లించండి!

ABN , First Publish Date - 2021-06-20T06:51:00+05:30 IST

రాష్ట్రంలో రైతులకు చెల్లించాల్సిన రూ. 3,607 కోట్ల ధాన్యం బకాయిలను 48 గంటల్లోగా చెల్లించాలని, వరి రైతులకు ఏప్రిల్‌ 10 నుంచి కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌ చేశారు.

48 గంటల్లోగా ధాన్యం బకాయిలు చెల్లించండి!
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు

  • ఏప్రిల్‌ 10 నుంచి కొనుగోలు చేసిన  ప్రతి బస్తాకు మద్దతు ధర ఇవ్వాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప డిమాండ్‌
  • కలెక్టరేట్‌ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన

కాకినాడ కార్పొరేషన్‌, జూన్‌ 19: రాష్ట్రంలో రైతులకు చెల్లించాల్సిన రూ. 3,607 కోట్ల ధాన్యం బకాయిలను 48 గంటల్లోగా చెల్లించాలని, వరి రైతులకు ఏప్రిల్‌ 10 నుంచి కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌ చేశారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ మేయర్‌ సుంకరప పావనితోపాటుగా పలువురు జిల్లా నాయకులతో కలిసి ఆయన కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని, ఒక్క మన జిల్లాలోనే వెయ్యి కోట్ల బకాయిలు చెల్లిం చాలన్నారు. రైతులకు ఇస్తున్నారన్న సున్నా వడ్డీ ఎక్కడా లేదని, ఇన్స్యూ రెన్స్‌లు లేవని, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ లేదని, సబ్సిడీల ద్వారా ఇచ్చే స్ర్పేయర్లు, ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్స్‌ వంటివి ఇచ్చే పరిస్థితి  కరువైందన్నారు. రైతులు గత రెండేళ్ల నుంచి తీవ్రంగా నష్టపోవడం వల్ల రాష్ట్రంలో 800 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, రైతులకు మద్దతు ధర, ధాన్యం బకాయిలు చెల్లించే వరకూ ఉద్యమం చేయడం జరుగుతుందన్నారు. 48 గంటల్లోగా స్పందించక పోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. అనపర్తి మాజీ ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఈ అంశాలపై టీడీపీ దృష్టి సారించడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెబుతున్న కేంద్రా లు ఎక్కడా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు సిరాససల్లి నాగేశ్వర రావు, అమలాపురం పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు మహాలక్ష్మి ప్రభాకర్‌, కాకినాడ పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షులు శ్రీనుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:51:00+05:30 IST