నా భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పట్టాభి భార్య చంద్ర
ABN , First Publish Date - 2021-10-21T03:18:58+05:30 IST
తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చంద్ర అన్నారు. సెక్షన్ 120 బి కింద పట్టాభిని ...
విజయవాడ: తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చంద్ర అన్నారు. సెక్షన్ 120 బి కింద పట్టాభిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పటమట పీఎస్లో కేసు నమోదయ్యిందని పోలీసులు చెప్పినట్లు చంద్ర తెలిపారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదని పట్టాభి భార్య చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి ఇంటి గేట్లు విరగొట్టి లోపలికి మరీ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్పేట పోలీస్స్టేషన్లో పట్టాభిపై కేసులు నమోదు చేశారు. పట్టాభిని గవర్నర్పేట పీఎస్కు తరలిస్తున్నారు. పట్టాభిపై 120బీ, 505, 504 సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.