విద్యుత్‌ చార్జీలపై టీడీపీ పోరుబాట

ABN , First Publish Date - 2021-10-19T08:02:13+05:30 IST

పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం 364 గ్రామాల్లో టీడీపీ నేతలు పర్యటించారు.

విద్యుత్‌ చార్జీలపై టీడీపీ పోరుబాట

  • 364 గ్రామాల్లో నేతల పర్యటన


అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం 364 గ్రామాల్లో టీడీపీ నేతలు పర్యటించారు. కొన్ని చోట్ల ఫ్యాన్‌లను చేతిలో పట్టుకుని, జగన్‌రెడ్డి పాలనలో ఫ్యాన్లు తిరగడం లేదంటూ నిరసన తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచనని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన జగన్‌ ఈ రెండున్నరేళ్లలో ఆరు సార్లు రూ.36,802 కోట్ల భారం విద్యుత్‌ వినియోగదారులపై మోపారని వారు ఆరోపించారు. నెలకు రూ.350 వచ్చే బిల్లు ఇప్పుడు రూ.1,000కి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించడంతో పాటు ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  విద్యుత్‌ చార్జీలను తగ్గించి, ట్రూఅప్‌ చార్జీలను రద్దు చేసి, డిస్కంల బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే చెల్లించి, అధిక ధరలకు విద్యుత్‌ కొనకుండా, విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25 నుంచి 29 వరకు ప్రాంతీయ స్థాయిలో వినూత్న నిరసనలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది.  

Updated Date - 2021-10-19T08:02:13+05:30 IST