బార్లు తెరిచి ప్రజలను బలి చేస్తారా?: ప్రభుత్వంపై బుద్దా ఫైర్

ABN , First Publish Date - 2020-09-19T16:06:08+05:30 IST

రాష్ట్రంలో బార్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుపట్టారు. ‘కోవిడ్ కారణంగా 40% మంది ఉద్యోగాలు

బార్లు తెరిచి ప్రజలను బలి చేస్తారా?: ప్రభుత్వంపై బుద్దా ఫైర్

అమరావతి: రాష్ట్రంలో బార్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుపట్టారు. ‘కోవిడ్ కారణంగా 40% మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం బార్లు మరియు లిక్కర్‌పై దృష్టి సారించటం సిగ్గుచేటు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ వేల సంఖ్యలో పెరుగుతుంటే ఈ సమయంలో ప్రభుత్వం బార్లకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికే మద్యం షాపులు తెరిచి వేల సంఖ్యలో ఉన్న కరోనా కేసుల్ని లక్షల సంఖ్యలోకి మార్చి కరోనాలో ఏపీని దేశంలో 2వ స్థానానికి చేర్చారు. ఇప్పుడు బార్లు బార్లాగా  తెరచి ఇంకెంత మందిని కరోనా బారిన పడేస్తారు? మీ ఆదాయం కోసం ప్రజలను బలి చేస్తారా? వైసీపీ ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదా? వైసీపీ ప్రభుత్వం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేయడం తధ్యం అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది’ అని చెప్పారు.


‘ప్రభుత్వం కరోనా సమయంలో మద్యం షాపులు తెరవడమే తప్పయితే.. మద్యం రేట్లు పెంచి ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తోంది. మద్యం రేట్లు పెంచటంతో పెరిగిన రేట్లతో మద్యం కొనలేక అలవాటు మానలేక శానిటైజర్ త్రాగి 50 మంది ప్రాణాలు తీసుకున్నారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు ఏం చేసింది? ఎక్సైజ్ మంత్రి రాష్ట్రంలో నాటు సారా, అక్రమ మద్యం గంజాయి వంటి వాటిని అరికట్టడంపై దృష్టి పెట్టకుండా ప్రజలను బెదిరించడం, అందినకాడికి దోచుకోవడం, టీడీపీపై బురద చల్లటంపైనే దృష్టి సారిస్తున్నారు. కమీషన్లు తీసుకుని మంత్రే ఏకంగా రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకానికి, నాటు సారా తయారీకి అనుమతిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ఆంధ్రప్రదేశ్ మధ్యాంద్రప్రదేశ్‌గా మారిపోయింది. ప్రభుత్వం ఆదాయం గురించి ఆలోచించకుండా ప్రజల ప్రాణాల గురించి ఆలోచించి రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా మద్యం షాపులు, బార్లకు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-19T16:06:08+05:30 IST