దోచుకొన్న సొత్తు పంపకాల్లో తేడాలు

ABN , First Publish Date - 2020-07-07T09:10:36+05:30 IST

‘‘వైఎస్సార్‌ ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అధికార పార్టీ నేతలు రూ.20 వేల నుంచి రూ.లక్ష ..

దోచుకొన్న సొత్తు పంపకాల్లో తేడాలు

అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: బుద్దా 


విజయవాడ, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్సార్‌ ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అధికార పార్టీ నేతలు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకూ పేదల నుంచి వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మును పంచుకొనే క్రమంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ తేడాల వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. సోమవారం ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసిందన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్ల వ్యవహారాల్లో అధికార పార్టీ వారికి డీల్స్‌ సరిగ్గా కుదరకపోవటమే అందుకు ప్రధాన కారణమన్నారు. ఏ 2  విజయసాయిరెడ్డి ఆలోచన మేరకే సీఎం జగన్‌ ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో తక్కువ ఖరీదు చేసే పొలాలను ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు.


చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన ఆరు లక్షల ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇవ్వడానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరమేమిటో చెప్పాలని నిలదీశారు. గతంలో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.1100 కోట్లను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ మొత్తాన్ని కూడా తక్షణమే చెల్లించాలన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బడా కాంట్రాక్టర్లకే మేలు చేస్తూ, చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ బుద్దా ధ్వజమెత్తారు.

Updated Date - 2020-07-07T09:10:36+05:30 IST