టీడీపీకి దూరం కానున్న మరో ఎమ్మెల్యే..!

ABN , First Publish Date - 2020-09-19T03:40:42+05:30 IST

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి...

టీడీపీకి దూరం కానున్న మరో ఎమ్మెల్యే..!

విశాఖ: ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. శనివారం నాడు ఆయన సీఎం జగన్‌ను కలవనున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్‌ దూరంగా ఉన్నారు. అయితే.. వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటనే వాసుపల్లి గణేష్ కూడా ఎంచుకోనున్నట్లు తెలిసింది. జగన్‌ను కలవనున్న గణేష్‌ వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతు తెలపనున్నట్లు సమాచారం.


వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి కూడా ఇప్పటివరకూ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోలేదు. కరణం బలరాం జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన సందర్భంలో కూడా ఆయన కుమారుడికి మాత్రమే జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అసెంబ్లీకి హాజరయిన సందర్భంలో సమస్యలు ఎదురుకాకుండా వీరు ఈ బాటను ఎంచుకున్నారు.

Updated Date - 2020-09-19T03:40:42+05:30 IST