Payyavula kesav: సెక్యూరిటీ విషయంలో పయ్యావుల సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2022-08-10T18:40:00+05:30 IST
తన సెక్యూరిటీ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: తన సెక్యూరిటీ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula kesav) సంచలన ఆరోపణలు చేశారు. తన భద్రతకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం కావాలని వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కీలక విషయాలను ప్రస్తావిస్తున్నానని నన్ను టార్గెట్ చేశారు. నా సెక్యూర్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నారని.. ఓ అధికారి నాకు ముందుగానే చెప్పారు. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నా గన్ మెన్లు హైదరాబాదులో ఉండకూడదంటూ మూడు నెలల నుంచి విచిత్ర వాదన లేవనెత్తారు. పొరుగు రాష్ట్రాలకు గన్ మెన్లను ఇచ్చేదే లేదని చెబుతున్నారు. వైసీపీ నేతలు హైదరాబాదులో గన్ మెన్లతో ఉంటున్నారంటే.. దానికి సమాధానం లేదు. గన్ లైసెన్సుకు ఆల్ ఇండియా పర్మిట్ కావాలంటే నాలుగు నెలల నుంచి పెండింగులో పెట్టారు. గన్మెన్లను ఇతర రాష్ట్రాలకు వద్దంటున్నారు.. గన్ లైసెన్సు ఇవ్వడం లేదు.. గన్ మెన్లను మార్చారు. నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం మాది. నా నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయి. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేసిన మాజీ నక్సలైట్లు మా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నేను వెలుగులోకి తెస్తున్న విషయాలు.. రాసిన లేఖలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయేమో..? పోరాటాల్లో పుట్టి పెరిగిన వాడిని.. రాటు తేలిన వాడిని బెదిరింపులకు భయపడను. సెక్యూరిటీని పెంచాలని ఇంటెలెజిన్స్ చీఫ్ను అడిగిన మర్నాడే నా గన్మెన్లను మార్చారు’’. పయ్యవుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.