సీఎం జగన్తో ఎల్లుండి గంటా భేటీ.. వైసీపీ ఆఫర్ ఇదేనా..?
ABN , First Publish Date - 2020-10-01T21:37:10+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా...
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 3న సీఎం జగన్తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ కానున్నట్లు తెలిసింది. అదే రోజు.. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందుగా వైసీపీ తీర్థం తీసుకునేందుకు యత్నించారు. అయితే.. స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అడ్డం పడడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగింది. కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా జగన్తోనే మాట్లాడుకొని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారంటున్నారు. ఆయనకు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక.. ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ మూడో కంటికి తెలియకుండా జగన్ను కలిసిన సంగతి తెలిసిందే. విద్యా వ్యాపారంలో వున్న ఆయన ముందుకు సాగాలంటే అధికార పార్టీ నీడన చేరక తప్పదని గ్రహించి అటు వైపు అడుగులు వేశారు. దీనికి హైదరాబాద్ నుంచి కూడా కొంత రాయబారం నడిచిందని సమాచారం. ఏదేమైనా వాసుపల్లి చడీచప్పుడు లేకుండా అమరావతి వెళ్లి తన ఇద్దరు కుమారులతో కలిసి టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
సాగర తీర నగరంపై ఆ పార్టీ అధినేత జగన్కు ఎప్పటి నుంచో మోజు. 2014 ఎన్నికల బరిలో నేరుగా తన తల్లి విజయలక్ష్మినే నిలిపారు. ఆమె నాటి బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ విజయఢంకా మోగించినా విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక్కడ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. విశాఖలో ఈ విధమైన తీర్పును వైసీపీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఆ నలుగురిని పార్టీలోకి రప్పించుకుంటే... విశాఖలో ఇక తిరుగు వుండదని వ్యూహాలకు పదును పెట్టింది. దీనిపై చాలాకాలంగా మంతనాలు సాగుతున్నాయి.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కరోనా ప్రభావం ఎక్కువగా వున్నందున, అది తగ్గిన తరువాత వైసీపీ వైపు అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కరుడుగట్టిన టీడీపీ నాయకుడు. కృష్ణా జిల్లావాసి అయిన ఆయనను కొడాలి నాని, వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు వైపీపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఇంకా వైసీపీ అధిష్ఠానానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు.