పార్టీని మరింత బలోపేతం చేద్దాం
ABN , First Publish Date - 2021-10-19T05:06:41+05:30 IST
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారంలో మాజీమంత్రి నెట్టెం రఘురామ్
విద్యాధరపురం, అక్టోబరు 18 : అంకితభావంతో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం విజయవాడ పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా నెట్టెం మాట్లాడుతూ మహిళా అధ్యక్షురాలిగా సమర్థవంతమైన నాయకురాలిని నియమించారని, ఆమె ఆధ్వర్యంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ కొత్త మహిళా కార్యవర్గం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కొల్లి శారద, రాధిక, మైలవరం నుంచి బొమ్యసాని జ్యోతి, జగ్గయ్యపేటకు చెందిన రామలక్ష్మి, విజయవాడ పశ్చిమానికి చెందిన సరిత, సెంట్రల్కు చెందిన ఉదయశ్రీ, నందిగామకు చెందిన ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారంలో కొఠారు సత్యనారాయణప్రసాద్, గడ్డం హుస్సేన్, షేక్ ఆషా, నూకాలమ్మ, మాదాల రాజ్యలక్ష్మి, సందిరెడ్డి గాయత్రి, విజయలక్ష్మి, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, దాములూరి మధుసూదనరావు, పెదర్ల రవి, యలమంచిలి గౌరంగబాబు తదితరులు పాల్గొన్నారు.
జగన్ పాలనను ఎండగట్టాలి
జగన్రెడ్డి రెండున్నరేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, ఆ పాలన నుంచి విముక్తి పొందాలని ఎదురుచూస్తున్నారని టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం తెలుగు రైతు కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నెట్టెం తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రైతు కార్యవర్గ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబరు ఒకటి నుంచి అమరావతి రైతులు చేపడుతున్న న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రకు తెలుగు రైతులు సంఘీభావం తెలపాలని సూచించారు. తెలుగు రైతు అధ్యక్షుడు చెరకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ గతనెల 30వ తేదీన నిర్వహించిన ‘రైతుకోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమిటీల ఏర్పాటుపై చర్చించి సంస్థాగత తీర్మానాలు చేశారు.