ఇలాగైతే కష్టం.. జాగ్రత్త

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

‘జిల్లాలో అనేక సమస్యలున్నాయి. అందరూ కలిసి ఉమ్మడిగా ఒక్కదానిపై అయినా పోరాటం చేశారా? కలిసికట్టుగా బలం ప్రదర్శించారా? వెనుకబడిపోతున్నారు. ఇలాగైతే కష్టం. దెబ్బ తింటారు జాగ్రత్త..’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు.

ఇలాగైతే కష్టం.. జాగ్రత్త
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొన్న నేతలు

జనంలో ఉండకపోతే నష్టపోతాం

సీనియారిటీ పెరిగి పని తగ్గిపోతోంది  

పార్టీకి పట్టున్నా నేతల మధ్య సమన్వయ లోపం

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు చంద్రబాబు క్లాస్‌

వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

2014కి ముందు నాటి స్ఫూర్తిని అందరూ ప్రదర్శించాలి   

సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని నాయకులకు అధినేత హితవు


అమరావతి, గుంటూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో అనేక సమస్యలున్నాయి. అందరూ కలిసి ఉమ్మడిగా ఒక్కదానిపై అయినా పోరాటం చేశారా? కలిసికట్టుగా బలం ప్రదర్శించారా? వెనుకబడిపోతున్నారు. ఇలాగైతే కష్టం. దెబ్బ తింటారు జాగ్రత్త..’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో  సమావేశం నిర్వహించారు. నాయకుల పనితీరుపై ఈ సమావేశంలో ఆయన ఒకింత కఠినంగానే మాట్లాడినట్లు సమాచారం. పార్టీకి గట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అధికార పార్టీ వైఫల్యాలపై బలంగా పోరాడుతున్న వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎవరికి ఇబ్బంది వచ్చినా ఉమ్మడిగా కదిలి నిలబడాలి. ఎవరికి వారుగా పనిచేసుకుంటూ ఉంటే ఎలా? పల్నాడులో ఇప్పటికీ క్యాడర్‌పై దాడులు జరుగుతున్నాయి. అరాచకం పెరిగిపోతోంది. మీరంతా వెళ్లి అక్కడ నిలబడితే క్యాడర్‌కు ఊరటగా ఉంటుంది? ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి. పథకాల ప్రచారం తప్ప అనేక మందికి అవి అందడం లేదు. ధరలు, పన్నులు పెరిగిపోయి సామాన్యుడు నలిగిపోతున్నాడు. పేదలకు ఆదాయం పెరిగే మార్గాలు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. ఇలాంటి ప్రతి అంశంలోనూ మీరు ప్రజల్లో ఉండి పనిచేయాలి. చేయలేకపోతే వెనకబడిపోతారు. చేయగలిగినవారు ముందుకు వస్తారు. ఆపై మీ ఇష్టం..’ అని ఆయన వారితో అన్నారు. జిల్లాలో అందరూ పెద్ద నాయకులైపోయారని, సీనియారిటీ పెరిగి పని తగ్గిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత కూడా కొందరు ఇన్‌చార్జులు ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని, జనంలో లేకపోతే నష్టపోతామని గుర్తించాలని హెచ్చరించారు. పోలీసులు ఎక్కడైనా అతి చేసి పార్టీ కార్యకర్తలను కొడితే గట్టిగా స్పందించాలని, కొట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 12న ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని  నేతలు నిర్ణయించారు.  

\

ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలి

‘జిల్లాల విభజనతో ఎవరి దారి వారిదైంది. ఇది కరెక్టు కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లాని ప్రాతిపదికగా తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని అధినేత నాయకులకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో వైసీపీ అరాచకం రోజురోజుకు ప్రబలుతోన్నదని, దానిని ఎండగట్టాలన్నారు. 2014కి ముందు పార్టీ నేతలు ఎలాగైతే కసిగా పోరాడి అధికారంలోకి తీసుకొచ్చారో అదే స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. బాదుడే బాదడు కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బాగా జరుగుతోందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదులో గురజాల ప్రథమస్థానంలో, రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉండటంపై ఇన్‌చార్జి యరపతినేని శ్రీనివాసరావుని అభినందించారు. సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, అనగాని సత్యప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, చదలవాడ అరవిందబాబు, కోవెలమూడి రవీంద్ర, నజీర్‌ అహ్మద్‌, జూలకంటి బ్రహ్మారెడ్డి, మూడు జిల్లాల కో-ఆర్డినేటర్‌, కొండెపి ఎమ్మెల్యే బాలావీరాంజనేయస్వామి, వేగేశన నరేంద్రవర్మ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదు

ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 125 సీట్లు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు

అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో తాను ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ పోటీ చేయాలో వద్దో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారన్నారు. వారసులు కూడా టిక్కెట్లను ఆశిస్తున్నారని, వారిలో తన కుమారుడు, సోదరుని కుమార్తె కూడా ఉన్నారని  ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్నికలు జరిగినా పార్టీకి నూట పాతిక సీట్లు వస్తాయని తెలిపారు.  రాష్ట్రంలో అభివృద్ధి కనుచూపుమేరలో లేకుండా పోయిందని, మంచి అభ్యర్థులను పెట్టగలిగితే మంచి  ఫలితాలు వస్తాయన్నారు. ప్రజల్లో ఉన్నవారికే ఈసారి చంద్రబాబు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం కల్పించాలన్నారు. పొత్తుల విషయం తాము మాట్లాడేది కాదని, పార్టీ అధ్యక్షుడు దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 







Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST