కాకాణి ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులపై దౌర్జన్యాలు
ABN , First Publish Date - 2022-01-25T04:40:31+05:30 IST
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి ప్రోద్బలంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర
నెల్లూరు(వ్యవసాయం), జనవరి 24 : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి ప్రోద్బలంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పేర్కొన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు న్యాయం, ధర్మం లేకుండా వ్యవహరిస్తూ వైసీపీ నాయకులను రక్షిస్తున్నారన్నారు. పొదలకూరు ఎస్సై కరీముల్లా టీడీపీ మండల్ట అధ్యక్షుడుపై దాడికి పాల్పడ్డారని, ఆయన సతీమణిని దుర్భాషలాడారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకాణి చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన తమ నాయకుడు సోమిరెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గత తహసీల్దార్ స్వాతి చేసిన అవినీతి అక్రమాలను వెలికితీశాడన్న కారణంతోనే పొదలకూరు టీడీపీ నాయకుడు మస్తాన్బాబుపై పోలీసులతో దాడి చేయించారన్నారు. సర్వేపల్లిలో నాగేంద్రప్రసాద్కు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారని, శ్రీనివాసయాదవ్కు సంబంధించిన పొలాల్లో కాలువలు తవ్వించి నష్టపరిచారని, కోడూరు గంగాధర్ రొయ్యల గుంతలను విధ్వంసం చేసి కోట్లు నష్టం కలిగించారని వివరించారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. ఈ సమావేశంలో నాయకులు మస్తాన్బాబు, గుమ్మడి రాజాయాదవ్, పల్లంరెడ్డి రామ్మోహన్రెడ్డి, సన్నారెడ్డి సురేష్రెడ్డి, గాలి రామకృష్ణారెడ్డి, కోడూరు భాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, తాండ్ర మునికృష్ణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.