వరినాట్లు వేసి.. నిరసన తెలిపి
ABN , First Publish Date - 2021-07-25T06:33:51+05:30 IST
వర్షపునీటితో బురదతో మడుగులా మారిన రోడ్డుపై టీడీపీ నేతలు వరినాట్లు వేశారు.
వెల్లూరు- టీపీ కోట రోడ్డులో టీడీపీ నేతల ఆందోళన
తట్ట మట్టి కూడా ప్రభుత్వం వేయడం లేదని విమర్శ
నాగలాపురం, జూలై 24: వర్షపునీటితో బురదతో మడుగులా మారిన రోడ్డుపై టీడీపీ నేతలు వరినాట్లు వేశారు. రోడ్లపై రెండు తట్టల మట్టి కూడా ప్రభుత్వం వేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘జగన్ పాలనలో అడుగడుగునా అవినీతి సంత.. రహదారిలో అడుగుకొక గుంత’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం నాగలాపురం మండలం వెల్లూరు- టీపీ కోట రోడ్డుపై వరినాట్లతో ఆందోళన చేపట్టారు. టీడీపీ పాలనలో ఎక్కడ రోడ్డు మరమ్మతులకు గురైనా వెంటనే బాగు చేసే వారని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ గుర్తుచేశారు. ఈ రెండేళ్ల వైసీపీ పాలనలో రోడ్లను బాగుచేయక అసమర్థ ప్రభుత్వంగా పేరుతెచ్చుకుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. ఏడు నియోజకవర్గాల నుంచి ఈ ధర్నాకు వస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారన్నారు. రోడ్లు బాగుపడే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నాగలాపురం- టీపీ కోట రోడ్డు మరమ్మతులకు తాను ఏడు నెలల కిందట పాదయాత్ర చేస్తే రూ.42 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని సత్యవేడు ఇన్చార్జి జేడీ రాజశేఖర్ తెలిపారు. తర్వాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. అనంతరం టీడీపీ నేతలు గ్రావెల్ తెప్పించి ఆ గుంతను పూడ్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, నెలవల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్కుమార్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్వర్మ, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, ఉపాధ్యక్షుడు సతీ్షనాయుడు, కార్యదర్శి లోకరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు యాచేంద్రనాయుడు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సుందరరామిరెడ్డి, టీఎన్టీయూసీ అధ్యక్షుడు జయరామరెడ్డి, తణుకు రైతు అధ్యక్షుడు గోపినాథ్రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జులు సంతో్షనాయుడు, వెంకటేష్, మాజీ ఎంపీపీ మస్తాన్, మండల నాయకులు పార్దీబన్, భాస్కర్శెట్టి, రాజశేఖర్యాదవ్, అన్బు, వాసు తదితరులు పాల్గొన్నారు.