ప్రజాస్వామ్యానికే మచ్చ

ABN , First Publish Date - 2021-03-02T06:10:13+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనకు వెళుతుండగా రేణిగుంట విమానాశ్రమంలో పోలీసులు నిర్బంధించడం అమానుషమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్యానికే మచ్చ
నందికొట్కూరులో మాట్లాడుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు జాకీర్‌ హుసేన్‌

  1.  చంద్రబాబు నిర్బంధంపై టీడీపీ నాయకుల ఆగ్రహం


బనగానపల్లె మార్చి 1: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనకు వెళుతుండగా రేణిగుంట విమానాశ్రమంలో పోలీసులు నిర్బంధించడం అమానుషమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సాగిస్తుస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రేణిగుంట విమానాశ్రమంలో చంద్రబాబునాయుడును పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ నాయకులు అధికార మదంతో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యానికి ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ నాయకులు, మంత్రులు, తూట్లు పొడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పోలీస్‌ రాజ్యం తేవాలని చూస్తే ప్రజలు తిరగబడతారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నిత్యం కేసులు పెడుతూ నిర్బంధించాలని చూస్తే సముద్ర కెరటంలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పైకి లేస్తామన్నారు. 


ఆళ్లగడ్డ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే మచ్చని టీడీపీ నాయకులు బాచ్చాపురం శేఖరరెడ్డి, సోముల చంద్రశేఖరరెడ్డి, హుసేన్‌బాషా ఖండించారు. సొంత రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రిని ఇలా అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ పాలనకు పరాకాష్టని అన్నారు. 


చాగలమర్రి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చిత్తూరుజిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం దారుణమని మాజీ ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి ఆరోపించారు. సోమవారం వారు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తున్న చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే నిలిపి వేయడం తగదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ తొత్తులుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని వారు ఆరోపించారు. టీడీపీ నాయకులను, అభిమానులను ఎయిర్‌పోర్టుకు రానివ్వకుండా అక్రమ అరెస్టులు, హౌస్‌ అరెస్టులతో అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. 


నందికొట్కూరు: వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలతో ప్రజల గొంతు నొక్కేస్తోందని నందికొట్కూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు జాకీర్‌హుసేన్‌ అన్నారు. చిత్తూరుజిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానా శ్రయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నందుకు టీడీపీ కార్యాలయంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు మద్దతుగా నిలిచే నాయకులపై వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మాజీ కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, సురేంద్ర, వేణు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T06:10:13+05:30 IST