విద్యుత్ చార్జీల పెంపుపై తెలుగు తముళ్ల నిరసన
ABN , First Publish Date - 2021-10-23T04:59:10+05:30 IST
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచడంపై తెలుగుతమ్ముళ్లు నిరసన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆధ్వర్యంలో పార్లపల్లిలో భారీ ర్యాలీ
విడవలూరు, అక్టోబరు 22: వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచడంపై తెలుగుతమ్ముళ్లు నిరసన తెలిపారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకటేశ్వర్లు నాయకత్వంలో మండలంలోని పార్లపల్లి గ్రామంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. తొలుత టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పోలంరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులతో పోలంరెడ్డి మాట్లాడారు. రెండు ట్యూబ్లైట్లు, ఫ్యాను ఉన్న ఇంటికి రూ. 8వేలు, రూ.15వేలు, రూ. 25వేలు కరెంటు బిల్లులు వచ్చాయని పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. టీడీపీ హయాంలో రూ.500 వస్తున్న కరెంటు బిల్లు ప్రస్తుతం వేలల్లో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ రెండున్నరేళ్లలో దశల వారీగా చార్జీలను పెంచి సుమారు రూ.36,800 కోట్లు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో నిరుపేదలను నిలువునా దోచుకుంటున్నారన్నారు. ఒక్క నెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ అఽధికారులు వినియోగదారులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, మండల అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నాడి చంద్రశేఖర్, నాయకులు పూండ్ల ఏసోబు, యోపూరు లలితమ్మ, ఇమాంబాషా, ముక్కు రమేష్, తాళ్ల సురేష్, అశోక్, శ్రీకాంత్, మద్దులూరి రాజా, చిన్ని శ్రీను, నిమ్మల రాజేష్, నాశిన ఉదయ్, చిన్ని బాబు తదితులు పాల్గొన్నారు.
కమీషన్ల కోసమే విద్యుత్ చార్జీల పెంపు
కోవూరు : కమీషన్ల కోసమే ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. మండలంలోని పాటూరు గ్రామంలో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్తు చార్జీల వల్ల సామాన్యులు నలిగిపోతున్నారని చెప్పారు. పేదల కాలనీ ఇళ్లకు సైతం రూ.20 వేల నుంచి 30 వేల బిల్లులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని చెప్పారు. అధికారపార్టీ దౌర్జన్యాల్ని ముక్తకంఠంతో ఎదుర్కోవాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, బాలారవి, పంది రఘరామ్, సూరిశెట్టి శ్రీనివాసులు, నాటకరాని వెంకట్, యద్దనపూడి నాగరాజు, నాటకరాని వెంకట్, పాలూరు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ విజయకుమార్, పన్నెం సుధాకర్, పన్నెం వంశీ, చామంతిపురం గౌతమ్ పాల్గొన్నారు.