జగన్ అసమర్థ చర్యల వల్లే....:యనమల
ABN , First Publish Date - 2021-05-11T15:48:12+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ అసమర్థ చర్యల వల్లే రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అసమర్థ చర్యల వల్లే రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆక్సిజన్ అందక జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరాపై ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. జనం పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. తమ నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది ప్రాణాలను బలిపెడతారని ఆయన నిలదీశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో బంధువుల కళ్లెదుటే 11మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ చేతగాని తనాన్ని డాక్టర్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యమంత్రి, జిల్లా మంత్రులు, శాసనసభ్యలు ఏమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొద్దునిద్రవీడి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని యనమల రామకృష్ణుడు హితవుపలికారు.