వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-02-26T08:41:06+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో దళితులను వేధిస్తున్న వైసీపీ నేతలు, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య...
- జాతీయ ఎస్సీ కమిషన్కు వర్ల లేఖ
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో దళితులను వేధిస్తున్న వైసీపీ నేతలు, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల తర్వాత వెసీపీ నేతలు తన ఇంటిముందు బాణాసంచా కాలుస్తుంటే దళిత నేత రాఘవ వారిని వారించారని, దీంతో వారు రాఘవపైనా, ఆయన కుమారుడు, కుమార్తె పైనా దాడిచేసి కొట్టారని వర్ల తెలిపారు. తర్వాత అక్కడకు వచ్చిన బిక్కవోలు ఎస్సై బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి రాఘవ కుమారుడిని లాఠీతో కొట్టారని, ఇతర కుటుంబ సభ్యులను దారుణంగా దూషించారని లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటనపై రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన ఆరుగురిపై కేసు పెట్టారని, అదే సమయంలో అధికార పార్టీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పద్దెనిమిది మందిపై ఎదురు కేసు పెట్టారని ఆయన వివరించారు. ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలని రాఘవపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ను వర్ల రామయ్య కోరారు.