Varla ramaih: ఏపీ సీఐడీ పోలీసులమని చెప్పిన నలుగురిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-10-04T14:54:34+05:30 IST

టీడీపీ నేత చింతకాయల విజయ్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులమంటూ వచ్చిన నలుగురు వ్యక్తులపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

Varla ramaih: ఏపీ సీఐడీ పోలీసులమని చెప్పిన నలుగురిపై చర్యలు తీసుకోండి

అమరావతి: టీడీపీ నేత చింతకాయల విజయ్ (Chintakayala vijay) నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులమంటూ వచ్చిన నలుగురు వ్యక్తులపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్‌ (Telangana Child Rights Commission)కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla ramaiah) ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసుల వికృత చేష్టలను తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు చింతకాయల విజయ్ ఇంట్లోకి సివిల్ డ్రెస్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు చొరబడ్డారని అన్నారు. ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించి  విజయ్ డ్రైవర్‌ను కొట్టారని, షెల్ఫ్‌లు, కబ్బోర్డులు తెరిచి వస్తువులను చెల్లాచెదురు చేశారన్నారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఏపీ సీఐడీ పోలీసులని సమాచారమని చెప్పారు.


‘‘విజయ్ ఐదేళ్ల కుమార్తెను మీ నాన్న ఎక్కడని ప్రశ్నించారు. చిన్నారిని పదే పదే ప్రశ్నించి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారు. ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న పిల్లల ఫోటోలను సీఐడీ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ప్రశ్నించడంతో చిన్నారులు మానసిక వేదనకు గురయ్యారు. పిల్లలతో అనుచితంగా ప్రవర్తించిన ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోండి. తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలి’’ అని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-10-04T14:54:34+05:30 IST