AP News: చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ తీరును తప్పుబట్టిన వర్ల

ABN , First Publish Date - 2022-10-03T15:39:03+05:30 IST

టీడీపీ నేత చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ పోలీసుల తీరును తప్పుబడుతూ డీజీపీకి తెలుగు దేశం నేత వర్ల రామయ్య లేఖ రాశారు.

AP News: చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ తీరును తప్పుబట్టిన వర్ల

అమరావతి: టీడీపీ నేత చింతకాయల విజయ్ (Chintakayala vijay) వ్యవహారంలో సీఐడీ (AP CID) పోలీసుల తీరును తప్పుబడుతూ డీజీపీకి తెలుగు దేశం నేత వర్ల రామయ్య (Varla ramaiah) లేఖ రాశారు. సీఐడి పోలీసుల తీరుపై ఎన్ని విమర్మలు వస్తున్నా వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదన్నారు. గోడలు దూకడం, బలవంతంగా ఇళ్లలోకి చొరబడటం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమైందని మండిపడ్డారు. ఏపీ సీఐడీ పోలీసులు డికె బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వంటి కేసులలో భారత సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని అన్నారు. సీఐడీ పోలీసులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.  సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటిలో ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఏపీ సీఐడీ పోలీసులు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా నవ్వులపాలు అవ్వాలనుకుంటున్నారా అని లేఖలో ప్రశ్నించారు. 


సీఐడీ పోలీసులు బ్యాడ్జీలతో ఎందుకు ధరించలేదని, ఐదేళ్ల పిల్లవాడిని ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని,  సివిల్ దుస్తుల్లో వెళ్లి ఏం నిరూపించాలనుకున్నారని ప్రశ్నలు కురిపించారు. నిజంగా 41A నోటీసు ఇవ్వడానికి వెళ్లితే షెల్ఫ్‌లు, కబోర్డులు తెరవాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. విజయ్ డ్రైవర్ చంద్రను కొట్టాల్సిన అవసరం ఏమిటన్నారు. సీఐడీ పోలీసుల‌ను సక్రమమైన మార్గంలో పెట్టని పక్షంలో ఏపీ సీఐడీ దేశ‌వ్యాప్తంగా నవ్వుల పాల‌య్యే అవ‌కాశం ఉంద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విజయ్ డ్రైవర్‌పై దాడి చేసిన సీఐడీ అధికారులపై చర్య తీసుకోవాలని వర్ల రామయ్య (TDP Leader) లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-03T15:39:03+05:30 IST