సాక్షి పేపర్‌లో రెడ్డి తీసేసి వార్త రాశారు: అనిత

ABN , First Publish Date - 2021-03-01T21:55:03+05:30 IST

ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.

సాక్షి పేపర్‌లో రెడ్డి తీసేసి వార్త రాశారు: అనిత

గుంటూరు: ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగoలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత వ్యాఖ్యానించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అంటూ ప్రశ్నించారు.


సాక్షి పేపర్లో మాత్రం నిందితుడి పేరుకి రెడ్డి తీసేసి వార్త రాశారని అనిత చెప్పారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని, కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని, నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామన్నారు. ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అంటూ వంగలపూడి అనిత నిలదీశారు.

Updated Date - 2021-03-01T21:55:03+05:30 IST