ఎన్నికల ముందు జగన్ బాదుడే బాదుడు డైలాగ్ ఇప్పుడు అమలవుతోంది: టీడీపీ నేత
ABN , First Publish Date - 2022-01-11T19:52:34+05:30 IST
రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అమాతం పెంచేసి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై ధరలతో చుక్కలు చూపుతుందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
ఏలూరు: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అమాతం పెంచేసి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై ధరలతో చుక్కలు చూపుతుందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పెంచిన నిత్యావసర వస్తువులు తగ్గించాలంటూ తణుకు నరేంద్ర కూడలి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ బాదుడే బాదుడు డైలాగ్ ఇప్పుడు అమలవుతుందన్నారు. రాష్ట్రంలో ఉప్పు నుంచి పెట్రోల్ , డీజిల్ వరకు దరలు పెంచటమే ఇందుకు నిదర్శనమన్నారు. రెండున్నర సవత్సరాల జగన్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలం చెంది రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ఆయన విమర్శించారు.
ఈ రెండు సంవత్సరకాలంలో నిత్యావసర వస్తువులపై ధరలు పెంచిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికె దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ ధర రూ.108 ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే అని అన్నారు. కేంద్ర కన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నులు వసూళ్లు చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుక , క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా వంటి కానుకలకు ప్రజలకు దూరం చేసి ప్రజలు పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సీఎం కళ్లుతెరిచి ప్రజలపై మోపుతున్న ధరల భారన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
నరేంద్ర కూడలి నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు టీడీపీ నేతలతో కలిసి రాధాకృష్ణ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, మాజీ ఏఎమ్సీ చైర్మన్ తోట సూర్యనారాయణ , రాష్ట్ర మహిళా కార్యదర్శి తామరపు రమణమ్మ, టౌన్ మహిళ అధ్యక్షురాలు కొప్పాళ్ల ఇందిరాదేవి, జిల్లా మహిళా కార్యదర్శి తణుకు రేవతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు బోళ్ళ శ్రీను, తాతపూడి మారుతిరావు సప్పా రాజు, సుర సాహెబ్, నర్సాపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ల్ అధ్యక్షులు చుక్క సాయిబాబ, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.