స్టీల్ ప్లాంట్ విషయంలో మొదటి ముద్దాయి జగన్: పట్టాభి
ABN , First Publish Date - 2021-02-27T17:17:31+05:30 IST
స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు.
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 2019లో పోస్కోతో సమావేశమై, జులై 2019లో సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారని...అక్టోబర్లో ఎంఓయూ చేసుకున్నారని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రికి సమాచారం తెలిస్తే ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ విషయం లేవనెత్తలేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్తో, విజయసాయిరెడ్డితో పోస్కో ప్రతినిధులు సమావేశం అయ్యారని చెప్పారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుందని పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.