సీఎం జగన్‌కు నక్కా ఆనందబాబు లేఖ

ABN , First Publish Date - 2022-02-16T16:22:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు లేఖ రాశారు.

సీఎం జగన్‌కు నక్కా ఆనందబాబు లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని, దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని తెలిపారు. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్‌తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందన్నారు. రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల  గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని  పోలీసులు చెబుతున్నారన్నారు. కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుందని ప్రశ్నించారు. గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించిందన్నారు. వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని  ‎అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.


చివరకు ‎ఆన్‌లైన్‌లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే ‎ రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. వీటిపై ‎టీడీపీ తరపున ప్రశ్నిస్తే నర్సీపట్నం నుంచి అర్ధరాత్రి తమ ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పోలీసులే ఏకంగా 2 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామంటున్నారని,  ముఖ్యమంత్రి దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్,  మద్యం అమ్మాకాల వల్లే  మహిళపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. అక్రమ సంపాదన కోసం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్ మాఫియా, జూద క్రీడల్ని పెంచిపోషించటం వాస్తవం కాదా?  అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇకనైనా  రాష్ట్రంలో గంజాయి, డ్రగ్ మాఫియాను నివారించి రాష్ట్ర యువత భవిష్యత్ కాపాడాలని నక్కా ఆనంద బాబు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-02-16T16:22:33+05:30 IST