వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు దుర్దినం: Nakka anandbabu
ABN , First Publish Date - 2022-04-04T19:53:44+05:30 IST
వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు ఒక దుర్దినమని... ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
గుంటూరు: వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు ఒక దుర్దినమని... ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో ఎలా బాధ పడ్డామో.. మరలా ఈ రోజు అదే పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం విడిపోతుందన్నారు. వేమూరుకు కూతవేటు దూరంలో ఉన్న తెనాలిని కాదని బాపట్లలో కలపడం దారుణమని మండిపడ్డారు. బుద్ధి ఉన్న వారు ఎవరూ పార్లమెంట్ నియోజకవర్గం వారీగా జిల్లాలను ఏర్పాటు చెయ్యరన్నారు. పార్లమెంటు శాశ్వతం కాదని... ఇప్పటికి మూడు సార్లు మార్చారని, అలా జిల్లాలను కూడా భవిష్యత్లో మారుస్తారా అని ప్రశ్నించారు. వేమూరు ఎమ్మెల్యే ఈ విషయంలో నోరు మెదపకపోవటంతో చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ పాలన విధ్వంసాలతో ప్రారంభమైందని నక్కా ఆనంద్బాబు విరుచుకుపడ్డారు.