నేను ఏ సమయంలోనూ వైసీపీలోకి వెళ్లను: Maganti babu
ABN , First Publish Date - 2022-05-26T15:21:06+05:30 IST
మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు ఈరోజు నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు.
ఏలూరు: మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు(Maganti babu) ఈరోజు(గురువారం) నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. గురువారం ఏబీఎన్తో ఆయన మాట్లాడుతూ...‘‘నేను ఏ సమయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లను’’ అని స్పష్టం చేశారు. వైసీపీలో చేరినవారు కూడా త్వరలో తిరిగి టీడీపీలోకి వచ్చేస్తారని తెలిపారు. ఒక్కసారి ఛాన్స్ అడిగిన జగన్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల దుర్భాష, ఎమ్మెల్యేల రౌడీయిజం, పోలీసులతో దౌర్జన్యం, అక్రమ అరెస్ట్లే మిగిలాయన్నారు. మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ శుభ సమయం ఆరంభం కాబోతోందని అన్నారు. తాను మళ్ళీ ఏలూరు పార్లమెంట్ రాజకీయాల్లోనే ఉంటా అని మాగంటి బాబు తేల్చిచెప్పారు.
కాగా... ఇద్దరు తనయుల మరణం నేపథ్యంలో రెండేళ్లుగా మాగంటిబాబు రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈరోజు చినవెంకన్నను దర్శించుకున్న తర్వాత ఏలూరు పార్లమెంట్ జిల్లాలో మాగంటిబాబు పర్యటించనున్నారు.