AP News: కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన లోకేష్

ABN , First Publish Date - 2022-08-10T17:15:32+05:30 IST

రౌడీషీట‌ర్ల చేతిలో దారుణ‌ హ‌త్య‌కు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

AP News: కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన లోకేష్

నంద్యాల: రౌడీషీట‌ర్ల చేతిలో దారుణ‌ హ‌త్య‌కు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ (Surendra kumar) కుటుంబ సభ్యులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సురేంద్ర కుమార్ భార్య శ్రావణి, తల్లి దేవి, సోదరుడు రాజశేఖర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ(TDP) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ని అంద‌రూ చూస్తుండ‌గానే వెంటాడి వేటాడి హ‌త్య చేసి నాలుగు రోజులు అవుతున్నా హంతకులని పట్టుకోకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. కానిస్టేబుల్ సురేంద్ర కుమార్‌ను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడే వరకూ టీడీపీ పోరాడుతుందని లోకేష్ స్పష్టం చేశారు.


తన భర్త సురేంద్ర కుమార్‌ను అన్యాయంగా చంపేసారని శ్రావణి విలపించారు. ఇద్దరు బిడ్డలతో  జీవించడం ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీ పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసారని... కుటుంబానికి అండ లేకుండా పోయిందని సోదరుడు రాజశేఖర్ బాధని వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. హంతకులను తక్షణమే పట్టుకుని శిక్షించే విధంగా పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక నాయకులను లోకేష్ ఆదేశించారు. 

Updated Date - 2022-08-10T17:15:32+05:30 IST